
కొత్తపల్లి, వెలుగు: సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 22 నుంచి 28వరకు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాషలు లేని కాలంలో సైగల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేదని, అందువల్ల సైన్ లాంగ్వేజిని చిన్నచూపు చూడొద్దన్నారు.
జిల్లాలో అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ద్వారా అధికారులకు, ఉత్సాహం ఉన్న వారికి సైన్ లాంగ్వేజి నేర్పిస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఈపీఐడీ బాధ్యులు డాక్టర్ హిమాన్షు, ప్రియాంక, నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, తహశీల్దార్ నరేందర్, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.
పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, ఆఫీసుల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు తప్పనిసరి చేయడంతోపాటు చట్టంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జడ్పీలో నిర్వహించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యుల వర్క్ షాప్ లో ఆమె మాట్లాడుతూ 10 మంది కంటే ఎక్కువ కార్మికులు, ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలు, కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు పూర్తి చేయాలన్నారు.
అంతకుముందు కలెక్టరేట్లో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు సబ్జెక్టుల వారీగా తయారుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) జిల్లాస్థాయి మేళాను కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ట్రస్మా మాజీ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్ రావు, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, డీఈఒ మొండయ్య, మెప్మా పీడీ స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు.